పార్లమెంట్లో గళమెత్తుతుంటే.. మోదీతో శరద్ పవార్ భేటీ: ఊహాగానాలకు తెరలేపిన కీలక సమావేశం!
- ప్రధాని కార్యాలయంలో మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే సమావేశం
- పవార్ను ఆత్మీయంగా ఆహ్వానించిన మోదీ
- ఎన్డీఏ కూటమిలో పవార్ పార్టీ చేరుతుందంటూ ఊహాగానాలు
ఒకవైపు నీట్ లీకేజీతో పాటు పలు అంశాలపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తుంటే... మరోవైపు ప్రధాని కార్యాలయంలో జరిగిన ఒక కీలక భేటీ దేశ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేలు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోల్లో ప్రధాని మోదీ స్వయంగా శరద్ పవార్ను చిరునవ్వుతో చేతిని పట్టుకుని ఆహ్వానించడం, ఇద్దరు నాయకులు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ చర్చించుకోవడం కనిపించింది. రైతుల సమస్యలు, నీటిపారుదల రంగానికి సంబంధించిన పలు అంశాలపై పవార్ ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం.