అక్కడికి రండి... ఆసియా కప్ ట్రోఫీ ఇస్తాను: టీమిండియాకు మొహిసిన్ నఖ్వీ ఆఫర్
- ఆసియా కప్ గెలిచినా ట్రోఫీని తిరస్కరించిన టీమిండియా
- ఫైనల్ రోజు గంటపాటు కొనసాగిన ప్రతిష్టంభన
- ఈ వివాదంపై ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో బీసీసీఐ
- నవంబర్ 10న దుబాయ్లో ట్రోఫీ ఇస్తామన్న ఏసీసీ చైర్మన్
- కెప్టెన్, ఆటగాళ్లను పంపాలని బీసీసీఐకి నఖ్వీ లేఖ
ఈ విషయంపై బీసీసీఐతో పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు నఖ్వీ తెలిపారు. "నవంబర్ 10న దుబాయ్లో జరిగే కార్యక్రమానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇతర ఆటగాళ్లను ఆహ్వానించి, వారికి ట్రోఫీని అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం" అని కరాచీలో మీడియాతో అన్నారు.
అసలేం జరిగింది?
సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఏసీసీ చైర్మన్గా ఉన్న మొహిసిన్ నఖ్వీ, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో దాదాపు గంటపాటు మైదానంలో గందరగోళం నెలకొంది. చివరికి నఖ్వీ ఆదేశాలతో ట్రోఫీని స్టేడియం నుంచి వెనక్కి తీసుకెళ్లారు. భారత జట్టు ట్రోఫీ లేకుండానే స్వదేశానికి తిరిగి వచ్చింది. తాజాగా నఖ్వీ ప్రతిపాదనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.