త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఓటు వేయనున్న 3.99 లక్షల మంది ఓటర్లు
- 2,07,382 మంది పురుష ఓటర్లు, 1,91,593 మంది మహిళా ఓటర్లు
- నియోజకవర్గంలో 25 మంది థర్డ్ జెండర్ ఓటర్లు
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 95 మంది విదేశీ ఓటర్లు
ఓటర్లలో 18-19 ఏళ్ల వయస్సు ఉన్నవారు 6,106 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 2,613 మంది, 1,891 మంది వికలాంగులు ఉన్నారు. దివ్యాంగుల ఓటర్లలో 519 మంది దృష్టి లోపం ఉన్నవారు, 667 మంది లోకోమోటివ్ వైకల్యం ఉన్నవారు, 311 మంది మూగ లేదా చెవిటి వారు, 722 మంది ఇతర వైకల్యం కలిగిన వారు ఉన్నట్లు తెలిపారు. 95 మంది విదేశీ ఓటర్లు ఉన్నట్లు తుది ఓటర్ల జాబితా వెల్లడించింది.
సెప్టెంబర్ 2న విడుదలైన ముసాయిదా జాబితాలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా, 6,976 కొత్త పేర్లను చేర్చడం, 663 మందిని తొలగించడంతో, ఈ సంఖ్య 3,98,982కు చేరుకుంది. సర్వీస్ ఓటర్లతో పాటు, మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 3,99,000కు చేరుకుంది.
నియోజకవర్గంలోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలలో ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సగటున 980 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను ధృవీకరించుకోవచ్చని, నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు అభ్యంతరాలు ఏవైనా ఉంటే సమర్పించవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 3,85,287 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు ఓటర్ల సంఖ్య 3.49 శాతం పెరిగింది.
బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాలలో ఉప ఎన్నికలను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది.