Advertisement

పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. ఇకపై 'పాడెల్' ఆడాల్సిందే!

Pakistan Cricket Board new rule Padel mandatory for cricketers
  • పాక్ క్రికెటర్లకు 'పాడెల్' క్రీడను శిక్షణలో తప్పనిసరి చేసిన పీసీబీ
  • ఫిట్‌నెస్, చురుకుదనం, ఫీల్డింగ్ మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడి
  • లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు
  • రోజు విడిచి రోజు 40 నిమిషాలు ఈ గేమ్ ఆడాలని ఆదేశాలు
  • అకాడమీలో బాస్కెట్‌బాల్ కోర్టులు, ఇండోర్ గేమ్స్ కూడా ఏర్పాటుకు ప్రణాళిక
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచేందుకు ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. 'పాడెల్' అనే క్రీడను లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణలో భాగంగా తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం అకాడమీలో శిక్షణ పొందే క్రికెటర్లు రోజు విడిచి రోజు 40 నిమిషాల పాటు పాడెల్ ఆడాల్సి ఉంటుంది. ఈ క్రీడ ద్వారా ఆటగాళ్లలో చురుకుదనం, రిఫ్లెక్స్‌లు, ఫీల్డింగ్‌కు అవసరమైన కదలికలు మెరుగవుతాయని పీసీబీ భావిస్తోంది.

ఈ నిర్ణయంపై పీసీబీ సీనియర్ సెలెక్టర్, హై-పర్‌ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావెద్ మాట్లాడుతూ.. సుదీర్ఘ శిక్షణా శిబిరాల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశాడు. "మా ఆటగాళ్లలో చాలామంది ఇప్పటికే పాడెల్ ఆడుతున్నారు. కానీ, వారి నగరాల్లో పరిమిత సంఖ్యలో ఉన్న కోర్టుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే మేమే ఇప్పుడు ఎన్‌సీఏలో ప్రత్యేకంగా ఒక పాడెల్ కోర్టును నిర్మించాం" అని తెలిపాడు. ఆటగాళ్లు ఇప్పుడు తమ క్రికెట్ శిక్షణతో పాటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించాడు.

టెన్నిస్, స్క్వాష్ క్రీడల అంశాలు కలగలిపి ఉండే పాడెల్, చిన్న కోర్టులో ఆడతారు. అయితే, దీనికి ఎంతో శారీరక శ్రమ, ఓర్పు అవసరం. ఆడటానికి సరదాగా ఉంటూనే, ఫిట్‌నెస్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకిబ్ జావెద్ అన్నాడు. కేవలం పాడెల్‌కే పరిమితం కాకుండా అకాడమీని మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని తెలిపాడు. ఇందులో భాగంగా ఆటగాళ్ల కోసం బాస్కెట్‌బాల్ కోర్టులు, స్నూకర్ వంటి ఇతర ఇండోర్ గేమ్స్ కోసం ప్రత్యేక హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించాడు.

ఎన్‌సీఏను క్రికెటర్లకు ఒక 'రెండో ఇల్లుగా' మార్చడమే తమ లక్ష్యమని, ఇక్కడ వారి ఆట నైపుణ్యాలతో పాటు ఫిట్‌నెస్ స్థాయిలను కూడా మెరుగుపరచుకోవాలని ఆకాంక్షించాడు. అకాడమీని ఆటగాళ్లకు మరింత ఫలవంతంగా మార్చే ప్రణాళికలో భాగంగా, ఇప్పటికే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బౌలింగ్ మెషీన్‌ను కూడా ఏర్పాటు చేశామని ఆకిబ్ జావెద్ గుర్తుచేశాడు.
Advertisement
Pakistan Cricket Board
Aaqib Javed
Padel sport
National Cricket Academy Lahore
Pakistan cricket fitness
Cricket training innovation

More Telugu News