తమ్మినేని సీతారాంపై సమగ్ర విచారణకు ఆదేశించాం: అచ్చెన్నాయుడు
- స్పీకర్గా ఉన్నప్పుడు నీతులు చెప్పిన తమ్మినేని దారుణాలకు ఒడిగట్టాడన్న అచ్చెన్నాయుడు
- బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్టు చిత్రీకరించారని మండిపాటు
- తప్పు చేసిన వారిని ప్రభుత్వం చట్టప్రకారం శిక్షిస్తుందని వ్యాఖ్య
వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... స్పీకర్గా ఉన్నప్పుడు నీతులు చెప్పిన తమ్మినేని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం దారుణమన్నారు. బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు చిత్రీకరించి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరువు తీసిన వారిని ధర్మాన వంటి నేతలు వెళ్లి పరామర్శించడం, జగన్ వారిని సమర్థించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులు తమ సంస్కృతి కాదని, తప్పు చేసిన ఎవరినైనా కూటమి ప్రభుత్వం చట్టప్రకారం శిక్షించి తీరుతుందని స్పష్టం చేశారు.
గతంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు రైతు కండువాలు వేసి ఉత్తుత్తి సమావేశాలు నిర్వహిస్తున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలు తమ ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా నేరుగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారన్నారు. ఢిల్లీ స్థాయిలో ఈ చర్చలు ఫలవంతం కావడంతో, ఆ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబుకు దక్కుతుందోనన్న భయంతోనే జగన్ సరికొత్త రాజకీయ నాటకాలకు తెరలేపారని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం రైతుల ప్రతి సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.