Advertisement

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Chandrababu Naidu meets PM Modi and invites him for Bhogapuram Airport inauguration
  • ఢిల్లీలో ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
  • ఆగస్ట్ 1న జరగనున్న కార్యక్రమానికి ప్రభుత్వ భారీ ఏర్పాట్లు
  • ప్రత్యేక బాధ్యతలతో నలుగురు ఐఏఎస్ అధికారుల నియామకం
  • ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని అంచనా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆగస్ట్ 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధానిని స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఇవాళ‌ మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు.

మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా, గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్‌లు ప్రజా అవసరాలు, పారిశుద్ధ్య వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. వీరికి సహకారం అందించేందుకు మరో 26 మంది నాన్-క్యాడర్ అధికారులను కూడా నియమించారు. వీరంతా విజయనగరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేస్తూ ఏర్పాట్లను సమన్వయం చేయనున్నారు.

విజయనగరం జిల్లాలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ఉత్తరాంధ్ర ప్రాంతానికి మణిహారంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి తరహాలోనే భోగాపురం పరిసరాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వేలాదిగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Advertisement
Chandrababu Naidu
Narendra Modi
Bhogapuram International Airport
Andhra Pradesh Development
North Andhra Infrastructure
Vizianagaram

More Telugu News