వచ్చే వారం ట్రంప్తో పాక్ ప్రధాని భేటీ.. భారత్ తో ఉద్రిక్తతలపై చర్చ!
- సెప్టెంబర్ 25న జరగనున్న కీలక సమావేశం
- అజెండాలో భారత్-పాక్ ఉద్రిక్తతల అంశంపై చర్చకు అవకాశం
- ఇటీవల బలపడిన అమెరికా-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు
- కొద్ది నెలల క్రితమే రెండుసార్లు వాషింగ్టన్లో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్
ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్లో సంభవించిన వరదలు, ఖతార్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత నెలకొన్న పరిస్థితులు, భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా వీరి చర్చల ఎజెండాలో ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. అయితే, ఈ సమావేశం గురించి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) గానీ, వాషింగ్టన్లోని పాక్ రాయబార కార్యాలయం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇటీవలి కాలంలో అమెరికా-పాక్ సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కొద్ది నెలల వ్యవధిలోనే రెండుసార్లు వాషింగ్టన్లో పర్యటించారు. గత జూన్లో మునీర్తో సమావేశమైన ట్రంప్ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టోకరెన్సీ వంటి అంశాలపై చర్చించారు. ఆ తర్వాత జూలైలో పాకిస్థాన్తో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, ఆ దేశంలోని భారీ చమురు నిల్వలను వెలికితీయడంలో సహాయపడతామని హామీ ఇచ్చింది.
గత మే నెలలో భారత్తో సైనిక ఘర్షణ సమయంలో ట్రంప్ జోక్యం చేసుకొని శాంతిని నెలకొల్పారని పాకిస్థాన్ ప్రశంసించడంతో ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వాణిజ్యపరమైన హెచ్చరికలతో తానే ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చానని ట్రంప్ పేర్కొనగా, ఆ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల పాకిస్థాన్లోని కీలకమైన ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే.