పుణే రేప్ కేసులో భారీ ట్విస్ట్.. కొరియర్ బాయ్ కాదు, అతడు స్నేహితుడే!
- ఫుణే ఐటీ ఉద్యోగిని రేప్ కేసులో కొత్త కోణం
- కొరియర్ బాయ్ అత్యాచారం చేశాడన్న యువతి ఫిర్యాదు
- నిందితుడు అపరిచితుడు కాదు, ఆమె స్నేహితుడేనని వెల్లడి
- బెదిరింపు సెల్ఫీ, మెసేజ్ను యువతే సృష్టించిందని తేల్చిన పోలీసులు
- అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగింపు
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పుణే పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. "నిందితుడిగా అదుపులోకి తీసుకున్న వ్యక్తి, బాధితురాలు గత కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసు" అని ఆయన తెలిపారు. బుధవారం సాయంత్రం కొండ్వా ప్రాంతంలోని తన ఫ్లాట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొరియర్ ఏజెంట్ రూపంలో వచ్చిన వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని 22 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది.
నిందితుడు వెళుతూ వెళుతూ తన ఫోన్లోనే సెల్ఫీ తీసుకున్నాడని, అందులో తన వీపు, నిందితుడి ముఖంలో కొంత భాగం కనిపిస్తోందని ఆమె పోలీసులకు చెప్పింది. ఘటన గురించి ఎవరికైనా చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ తన ఫోన్లోనే ఓ బెదిరింపు మెసేజ్ కూడా టైప్ చేసి వదిలి వెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, ఉన్నత విద్యావంతుడైన అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బెదిరింపు సెల్ఫీని యువతే స్వయంగా తీసిందని, అందులో నిందితుడి ముఖం స్పష్టంగా కనబడుతుండగా దాన్ని ఎడిట్ చేసిందని పోలీసులు కనుగొన్నారు. బెదిరింపు సందేశాన్ని కూడా ఆమే టైప్ చేసుకుందని తేల్చారు. ఆమెను స్పృహ తప్పేలా చేయడానికి ఎలాంటి రసాయన స్ప్రే ఉపయోగించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. "యువతి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు. అత్యాచారం జరిగిందా లేదా అనే అంశంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది" అని అమితేశ్ కుమార్ వివరించారు.