గిల్ ఆటతీరు మెరుగుపడింది.. మాజీ కెప్టెన్ గంగూలీ కితాబు
- ఇంగ్లండ్తో తొలి టెస్టులో గిల్ 147 పరుగులు చేయడంపై ప్రశంస
- భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్
- కెప్టెన్ గిల్, పంత్, జైస్వాల్ సెంచరీలు
- రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 107/1
"వాళ్లు బాగా ఆడుతున్నారు, ముఖ్యంగా శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చాలా మెరుగుపడింది. ఇది చూడటానికి సంతోషంగా ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం, ఈ రోజు రెండో రోజే. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఎక్కడ ముగిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 113 ఓవర్లలో 471 పరుగులకు ఆలౌట్ అయింది. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ శతకాలతో రాణించారు. ముఖ్యంగా గిల్ తన ఇన్నింగ్స్ ఆద్యంతం పూర్తి నియంత్రణతో ఆడి, విదేశీ గడ్డపై తన రికార్డుపై ఉన్న విమర్శలకు సమాధానమిచ్చాడు.
అయితే, ఒక దశలో 430/3 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు కేవలం 41 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ 4/86 ప్రదర్శనతో భారత పతనంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ భారత్కు దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 131 బంతుల్లోనే సెంచరీ సాధించిన పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఇంగ్లండ్ ఇంకా 262 పరుగుల వెనుకబడి ఉంది.