వైసీపీని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యం: భూమన కరుణాకర్ రెడ్డి
- లేని మద్యం స్కామ్ లో జగన్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న భూమన
- ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
- చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారన్న కక్షతోనే నిజాయతీపరులైన కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని భూమన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని విమర్శించారు.
ఎక్కడా జరగని మద్యం కుంభకోణాన్ని సృష్టించి, అందులో జగన్ను ఇరికించి అరెస్ట్ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు కేసులతో పాలన సాగించాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజాయతీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలతో అధికారుల్లో ఆందోళన నెలకొందని ఆయన తెలిపారు.