గెలుపు ఆనందంలో ఉన్న శ్రేయ‌స్ అయ్యర్‌కు బీసీసీఐ ఊహించ‌ని షాక్!

Punjab Kings Win But Shreyas Iyer Faces BCCI Penalty
  • బుధ‌వారం చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే, పీబీకేఎస్ మ్యాచ్‌
  • చెన్నైను సొంత గ్రౌండులో 4 వికెట్ల‌తో తేడాతో ఓడించిన పంజాబ్‌
  • 72 ప‌రుగుల‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు విజ‌యంలో శ్రేయ‌స్ కీరోల్‌
  • ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కార‌ణంగా అత‌నికి రూ. 12ల‌క్ష‌ల జ‌రిమానా
బుధ‌వారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) 4 వికెట్ల‌తో తేడాతో ఓడించిన విష‌యం తెలిసిందే. పంజాబ్ సార‌థి శ్రేయ‌స్ అయ్యర్ 72 ప‌రుగుల‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జ‌ట్టుకు ఒంటిచెత్తో విజ‌యాన్ని అందించాడు. అయితే, ఆ గెలుపు ఆనందంలో శ్రేయ‌స్‌కు బీసీసీఐ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు అత‌నికి రూ. 12లక్షల జరిమానా విధించింది. 

"బుధవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన ఐపీఎల్ 2025, 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం ఇది. కావున‌ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇక‌, ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ (54), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (72) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అంత‌కుముందు భారీ స్కోర్ దిశ‌గా దూసుకెళ్తున్న‌ సీఎస్‌కేను క‌ట్ట‌డి చేయ‌డంలో స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ కీల‌క పాత్ర పోషించాడు. అత‌డు హ్యాట్రిక్ స‌హా ఒకే ఓవ‌ర్‌లో 4 వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును కోలుకోని దెబ్బ తీశాడు. దాంతో 200 ప్ల‌స్ స్కోర్ రావ‌డం ఖాయ‌మ‌నుకున్న సీఎఎస్‌కే 190 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 
Go Back to Shorts
Shreyas Iyer
BCCI
IPL 2025
Punjab Kings
Chennai Super Kings
Slow Over Rate
Fine
Cricket
Yuzi Chahal
Match Penalty

More Telugu News