ముంబయి ఇండియన్స్ తో లక్నో మ్యాచ్...రీ ఎంట్రీ ఇస్తున్న ఎక్స్ ప్రెస్ బౌలర్
- ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
ఈ మ్యాచ్ కోసం లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బౌలర్ మయాంక్ యాదవ్ బరిలో దిగుతున్నాడు. మయాంక్ యాదవ్ గత ఐపీఎల్ సీజన్ లో నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులు విసురుతూ బ్యాట్స్ మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అయితే గాయం కారణంగా చాలాకాలం క్రికెట్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్ నెస్ సాధించడంతో మళ్లీ బరిలో దిగుతున్నాడు.
అటు, ముంబయి జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. మిచెల్ శాంట్నర్, విఘ్నేశ్ పుతూర్ స్థానంలో కర్ణ్ శర్మ, కోర్బిన్ బాష్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. కోర్బిన్ బాష్ కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్.
టోర్నీలో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్ 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించినా... రన్ రేట్ తేడాతో 6వ స్థానంలో ఉంది.