Ramayana Drama: నాటకాన్ని రక్తికట్టించడం కోసం.. స్టేజిపైనే పందిని చంపి పచ్చి మాంసం తిన్న రాక్షస వేషధారి.. వీడియో ఇదిగో!

Odisha theatre actor playing demon in Ramayana kills pig on stage and eats meat raw
  • గంజాం జిల్లాలోని ఓ గ్రామంలో ఘటన
  • ‘కంజిఒవళా’ యాత్రలో భాగంగా నాటక ప్రదర్శన
  • కళాకారుల వికృత ప్రవర్తనపై సర్వత్ర విమర్శలు
  • రాక్షస పాత్రధారి, నిర్వాహకుడి అరెస్ట్
  • ఘటనను ఖండించిన అసెంబ్లీ
ఒడిశాలోని గంజాం జిల్లాలో వేసిన రామాయణ నాటక ప్రదర్శలో కళాకారులు వికృతంగా ప్రవర్తించారు. నాటకాన్ని రక్తికట్టించేందుకు స్టేజిపైనే మూగజీవాలను చంపి తిన్నారు. ‘కంజిఒవళా’ యాత్రలో భాగంగా ఓ గ్రామంలో ప్రదర్శించిన నాటకంలో కళాకారులు ఇలా వికృత పోకడలకు పోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రదర్శనలో భాగంగా వాలి, సుగ్రీవ వేషధారులు రెండు నాగుపాములతో స్టేజిపై ఆటలాడగా, రాక్షస వేషధారి మరింతగా చెలరేగిపోయాడు. నాటకాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు సజీవంగా ఉన్న ఓ వరాహాన్ని స్టేజిపై తలకిందులుగా వేలాడదీసి, కత్తితో దాని పొట్టచీల్చి పచ్చి మాంసాన్ని తినేశాడు. బతికున్న కోడిని నోటితో కొరికి చంపాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నాటక ప్రదర్శనపై విమర్శలు రావడంతో అసెంబ్లీలో పలువురు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తి ఖండించారు. మరోవైపు, పందిని చంపి మాంసం తిన్న రాక్షస వేషధారి బింబాధర గౌడ(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు పాములతో ఆటలాడిన కళాకారుల కోసం గాలిస్తున్నారు.
Ramayana Drama
Demon
Pig
Odisha

More Telugu News