కల్లు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు.. పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై దుమారం

BRS Fires On Puri Jagannath For His Double Ismart Movie Song
  • ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ’మార్ ముంత.. చోడ్ చింత‘ లిరికల్ సాంగ్ విడుదల 
  • పాటలో ‘ఏం జేద్దమంటవ్ మరి’ అన్న కేసీఆర్ మాట
  • వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలంటున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రజలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ నుంచి నిన్న విడుదలైన పాట బీఆర్ఎస్ ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాలోని ‘మార్ ముంత.. చోడ్ చింత’ అనే లిరికల్ సాంగ్‌ విడుదలైంది. పక్కా మాస్‌బీట్‌లో సాగే ఈ పాటలో హీరో రామ్, హీరోయిన్ కావ్యాథాపర్ కల్లు సీసాలు పట్టుకుని చిందేస్తారు. 

ఈ పాట మధ్యలో ఇటీవల పాప్యులర్ అయిన ‘ఏం జేద్దమంటవ్ మరి’ మాటను వాడారు. దీనిపై బీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన నాయకుడి మాటను ఇలా కల్లు పాటకు వాడడం ఏంటంటూ ఫైర్ అయింది. ఈ మాటను దురుద్దేశపూర్వకంగానే అందులో ఇరికించారని ఆరోపిస్తోంది.

పాటను రాసింది కాసర్ల శ్యామ్, సంగీతం అందించింది మణిశర్మ అయినా కేసీఆర్ మాటను దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్ణయం మేరకే పెట్టారని ఆరోపిస్తున్నారు. పాట రాసిన శ్యామ్, పాడిన సిప్లిగంజ్ ఇద్దరూ తెలంగాణ వారే కావడం గమనార్హం. పాట నుంచి కేసీఆర్ మాటను తొలగించడంతోపాటు పూరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Go Back to Shorts
Double Ismart
Maar Muntha Chod Chinta
Puri Jagannadh
Ram Pothineni

More Telugu News