T20 World Cup 2024: ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ చేరే జ‌ట్లివే..!

India part of all these experts prediction of four T20 World Cup semi finalists
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ చేరే జ‌ట్లేవో స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా వేశారు. టామ్ మూడీ, సునీల్ గవాస్క‌ర్‌, మాథ్యూ హేడెన్‌, ఆరోన్ ఫించ్‌, పాల్ కాలింగ్‌వుడ్‌, బ్రియ‌న్ లారా, అంబ‌టి రాయుడు, క్రిస్ మోరిస్‌, మ‌హ్మ‌ద్ కైఫ్‌, శ్రీశాంత్ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. 

వీరిలో ప్ర‌తి ఒక్క‌రూ టీమిండియా సెమీస్ చేరుతుంద‌ని చెప్ప‌డం విశేషం. అలాగే భార‌త్‌తో పాటు ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌కు కూడా సెమీస్ అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని వారు తెలిపారు. ఈ ఎక్స్‌ప‌ర్ట్స్ తాలూకు అంచ‌నాకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా త‌మ జ‌ట్ల‌ను అంచ‌నా వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈసారి ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు.. 5 గ్రూపులుగా విడిపోయి పోటీ ప‌డ‌నున్నాయి. టీమిండియా గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూపులో భార‌త్‌తో పాటు పాకిస్థాన్‌, ఐర్లాండ్, కెన‌డా, అమెరికా ఉన్నాయి. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్ 5వ తారీఖున ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 9న దాయాది పాకిస్థాన్‌తో న్యూయార్క్‌లోనే త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం 12న అమెరికాతో (న్యూయార్క్‌), 15న కెన‌డాతో (ఫ్లోరిడా) త‌న త‌ర్వాతి మ్యాచులు ఆడ‌నుంది.

టీ20 వరల్డ్‌ కప్‌కు భార‌త స్క్వాడ్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.    

రిజర్వ్ ప్లేయ‌ర్లు: శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మద్, అవేశ్ ఖాన్
Go Back to Shorts
T20 World Cup 2024
Team India
Cricket
Sports News
Star Sports

More Telugu News