ఇక రాజులమ్మ జాతరే... నాగచైతన్య 'తండేల్' నుంచి అదిరిపోయే గ్లింప్స్ విడుదల
- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
- చందు మొండేటి దర్శకత్వంలో చిత్రం
- మత్స్యకారుడిగా కనిపించనున్న నాగచైతన్య
తాజాగా ఈ చిత్రం నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్' పేరిట అదిరిపోయే గ్లింప్స్ వీడియో రిలీజైంది. "ఈపాలి యేట... గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే" అంటూ సముద్రంలో వల విసురుతూ నాగచైతన్య చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ఆరంభమవుతుంది. ఈ గ్లింప్స్ ద్వారా 'తండేల్' చిత్రకథను దర్శకుడు చూఛాయగా చెప్పేసినట్టు అర్థమవుతుంది.
సముద్ర జలాల్లో వేటకెళ్లే మత్స్యకారులను పాకిస్థాన్ సైన్యం పట్టుకుని వారిని ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉంచేయడం తెలిసిందే. 'తండేల్' చిత్రంలోనూ నాగచైతన్య, తదితరులు పాక్ సైన్యానికి చిక్కడం చూపించారు.
ఈ సందర్భంగా, జైల్లో కిందపడిన భారత త్రివర్ణ పతాకాన్ని నాగచైతన్య తీసుకోబోగా, పాక్ పోలీస్ అధికారి ఒకరు "దేశభక్తా?" అంటూ ప్రశ్నించగా... "మా నుంచి ఊడిపోయిన ఒక ముక్క (పాకిస్థాన్)... మీకే అంత ఉంటే... ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత ఉండాలి... భారత్ మాతా కీ జై" అంటూ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది.
'తండేల్' చిత్రంలో నాగచైతన్య సరసన సాయిపల్లవి కథానాయిక. ఇదొక ప్రేమకథా చిత్రం అని చిత్రబృందం ముందే చెప్పేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.