రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు
- అలవి కాని హామీలిచ్చి జనాలను మోసం చేశారని మండిపడ్డ మాజీ మంత్రి
- ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు రోజులకే రుణమాఫీ అన్నారు ఏమైందని ప్రశ్న
- పది రోజుల్లోనే రూ.15 వేల రైతు భరోసా అన్న హామీ అమలు చేశారా? అని నిలదీత
అసెంబ్లీ ఆవరణలో బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రుల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆడిట్ రిపోర్టులు మీడియాకు రిలీజ్ చేసిందని గుర్తుచేశారు. ఆయా శాఖలకు సంబంధించిన కాగ్, ఇతరత్రా ఆడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచామని చెప్పారు. ఆడిట్ రిపోర్టులు శ్వేతపత్రం కాకుంటే మరేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశం ఒకటేనని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పడానికే ఈ హంగామా అంతా అని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన కాగ్ రిపోర్టులను, ఆడిట్ నివేదికలను పరిశీలించి దానికి అనుగుణంగా హామీలు ఇవ్వాలని ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లెక్కలు వేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు చెబుతారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.