కేసీఆర్ మళ్లీ గెలిస్తే రాహుల్ బాబాను ప్రధాని చేసేందుకు ప్రయత్నిస్తాడు: అమిత్ షా

Amit Shah satires on congress and kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కేసీఆర్ మరోసారి గెలిస్తే కాంగ్రెస్ నేత రాహుల్ బాబాను ప్రధానిని చేసేందుకు ప్రయత్నిస్తాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ రావాలని ఆశిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లే అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అమ్ముడుపోతారన్నారు. 

రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ ప్రభుత్వం రాదని చురకలు అంటించారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచనదినోత్సవం జరపడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి భయపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను తాము బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాదిగల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామన్నారు. బీజేపీ గెలవగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తుందని పునరుద్ఘాటించారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేస్తామని ప్రకటించారు.
Go Back to Shorts
Amit Shah
BJP
Telangana Assembly Election
BRS

More Telugu News