KTR: ఈ కీలక సందర్భంలోనూ కలిసి రండి: ఎన్నారైలకు కేటీఆర్ విజ్ఞప్తి

  • ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్
  • ఉద్యమ కాలం నుంచి కలిసి నడిచిన ఎన్నారైలు ఈ సమయంలోను సహకరించాలన్న కేటీఆర్
  • కేసీఆర్ నాయకత్వం మరోసారి అవసరమనే విషయాన్ని గ్రామాల్లో చెప్పాలన్న కేటీఆర్
KTR request to NRI over telangana election

భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ఎన్నారైలు కలిసి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం బీఆర్ఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులు కలిసి రావాలని కోరారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి కదం తొక్కి తెలంగాణ సాధించుకొని, తెలంగాణ నిర్మాణంలోనూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సందర్భంలోనూ మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతంగా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసీఆర్ నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారన్నారు. రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసివుండి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలలో కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకొని ప్రజల మద్దతు కోరాలని ఎన్నారైలకు సూచించారు. ఇందుకోసం తమ తమ సామాజిక మాధ్యమాల ఆధారంగా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాలలో మరింత చురుగ్గా ఉంటూ, తెలంగాణ రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News