Advertisement

ఇందిరమ్మ ఇళ్ల కోసం కాల్ సెంటర్.. ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy launches call center for Indiramma Houses
  • ఇందిరమ్మ ఇళ్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్
  • 040-24603572 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
  • దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలు, ఇతర పత్రాలు అవసరం లేదు
  • ఇల్లు రాకపోతే రూ.10 వేల డిపాజిట్ వెనక్కి వస్తుంది
  • లబ్ధిదారుడు రూ.6 లక్షలు చెల్లిస్తే చాలు, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలకు తావులేకుండా పూర్తి సమాచారం అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజలు దళారులను నమ్మకుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఫోన్ చేసి అధికారిక సమాచారం పొందాలని సూచించారు. ఈ కాల్ సెంటర్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సమాచారం అందిస్తుందని తెలిపారు.

దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలు
దరఖాస్తు చేసుకునే సమయంలో కేవలం ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుందని, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. లాటరీ సమయంలో ఆ పత్రాలను సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో రూ.10,000 ఈఎండీని కేవలం యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ఒకవేళ లాటరీలో ఇల్లు కేటాయించకపోతే, ఆ మొత్తం తిరిగి అదే ఖాతాకు జమ అవుతుందని భరోసా ఇచ్చారు.

అర్హతలు, ప్రయోజనాలు
హైదరాబాద్ క్యూర్ పరిధిలో పదేళ్లుగా నివసిస్తున్న వారు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని మంత్రి వివరించారు. దరఖాస్తుదారుడికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఓఆర్ఆర్, క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదన్నారు. 

సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1BHK ఫ్లాట్‌ను నిర్మిస్తున్నామని, దీని మార్కెట్ విలువ రూ.40-60 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుండగా, లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. దీంతో పాటు 20 నుంచి 25 గజాల అవిభాజ్య వాటా (UDS) స్థలాన్ని కూడా లబ్ధిదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పొంగులేటి తెలిపారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ ద్వారా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Ponguleti Srinivas Reddy
Indiramma Towers Hyderabad
Indiramma Houses Helpline Number
Telangana Housing Scheme
Revanth Reddy
Hyderabad 1BHK Housing Application

More Telugu News