Nara Lokesh: దేశంలో 100 సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్: నారా లోకేశ్

  • నాలుగు రోజుల విరామం తర్వాత యువగళం మళ్లీ ప్రారంభం
  • జమ్మలమడుగు నుంచి పాదయాత్ర కొనసాగింపు
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన నారా లోకేశ్ 
Lokesh take a jibe at CM Jagan in Yuvagalam

నాలుగు రోజుల విరామం అనంతరం యువగళం పాదయాత్రను నారా లోకేశ్ నేడు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. రూ.1 లక్ష కోట్లు ఉన్న వ్యక్తి పేదవాడవుతాడా అనేది ఆలోచించాలని కోరారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు నిలిపివేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు. విద్యుత్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచారని ఆరోపించారు. 

రాష్ట్రంలో బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టారని, బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టారని అన్నారు. కోత విధించిన రిజర్వేషన్లను తాము అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకువస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో బీసీలపై 26 వేల దొంగ కేసులు పెట్టారని, టీడీపీ వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం తెస్తామని పేర్కొన్నారు. 

ఎస్సీలకు నిలిపివేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకువస్తామని స్పష్టం చేశారు. మైనారిటీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

"ఎందరు పిల్లలుంటే అందరికీ అమ్మ ఒడి అన్నారు. కానీ ఒక్కరికే ఇచ్చారు. మహిళలను ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లడుగుతారు? ప్రస్తుతం అమ్మ ఒడి, జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు" అని మండిపడ్డారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీని పేదరికంలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే టీడీపీ లక్ష్యమని లోకేశ్ ఉద్ఘాటించారు.

More Telugu News