Pawan Kalyan: ఇస్రో ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి: పవన్ కల్యాణ్

  • ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 
  • విజయవంతంగా పనిపూర్తిచేసిన జీఎస్ఎల్వీ-12
  • ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
  • భవిష్యత్ సమాచార విప్లవం కొత్త పుంతలు తొక్కుతుందని విశ్వాసం 
Pawan Kalyan appreciates ISRO success as NVS 01 enters into orbit

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. 

రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటి ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-12 రాకెట్ ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించి, కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారతీయులు గర్వించదగిన విషయం అని కొనియాడారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిన భారతదేశపు అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి అని పేర్కొన్నారు. 

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో అధునాతన సాంకేతికతో రూపొందించిన నావిక్ రెండో తరం ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కీర్తి పతాకలో మరో కలికితురాయి వంటివి అని అభివర్ణించారు. 

ఎల్1 సిగ్నల్స్ ను పంపే రెండో తరం నావిక్ ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థలో కచ్చితమైన సమాచారాన్ని పంపించేందుకు ఉపయోగపడతాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇవి భవిష్యత్తు సమాచార విప్లవంలో కొత్త పుంతలు తొక్కిస్తాయనడంలో సందేహంలేదని పేర్కొన్నారు. 

ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఇస్రో పురోభివృద్ధి కోసం నిరంతరాయంగా  కృషి చేస్తున్న వారందరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News