ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్
- అమరావతి పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందన్న శైలజానాథ్
- ప్రజలపై మోయలేని భారాన్ని మోపడం సరికాదని వ్యాఖ్య
- రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విమర్శ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చులు, టెండర్ల ప్రక్రియపై మాజీ మంత్రి, వైసీపీ నేత సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో ప్రస్తుతం నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. "అమరావతిలో కేవలం వరదలు మాత్రమే రావడం లేదు.. అక్కడ అవినీతి ప్రవాహం కూడా జోరుగా సాగుతోంది" అని శైలజానాథ్ ఘాటుగా విమర్శించారు.
అమరావతి ప్రాజెక్టు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందని శైలజానాథ్ హెచ్చరించారు. రాజధాని అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో మధ్యలోనే పనులు వదిలేసి వెళ్ళిపోయిన పాత కంపెనీలకే.. మళ్లీ ఇప్పుడు టెండర్లు కట్టబెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ రీ-టెండరింగ్ ప్రక్రియలో ఏమాత్రం పారదర్శకత లేదని, కొన్ని నిర్దిష్ట సంస్థలకే లబ్ధి చేకూర్చేలా తెరవెనుక వ్యవహారాలు నడుస్తున్నాయని మండిపడ్డారు.