మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర
- క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన కొల్లు రవీంద్ర
- బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి
- బందరు పోర్టు పనులను వేగవంతం చేస్తామన్న మంత్రి
మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బందరు మండలం కానూరు శివారు చిన్న క్యాంప్ బెల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంక్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ప్రతిపక్షాల పసలేని విమర్శలను తాము పట్టించుకోబోమని మండిపడ్డారు.
బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, ఈ ప్రాంత రూపురేఖలను మార్చే ప్రతిష్ఠాత్మక 'బందరు పోర్టు' పనులను మరింత వేగవంతం చేసి, వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. దీని ద్వారా మచిలీపట్నం పారిశ్రామికంగా ఎదిగి, స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు.