Nara Lokesh: ​​చంద్రబాబు దార్శనికతకు ఇదొక మచ్చుతునక: లోకేశ్

  • కర్నూలు జిల్లాలో లోకేశ్ యువగళం
  • కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర
  • చంద్రబాబు అపర భగీరథుడు అని పేర్కొన్న లోకేశ్
  • కరవుసీమకు జలకళ తెచ్చాడని కితాబు
Lokesh Yuvagalam in Kodumuru

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 94వ రోజు (మంగళవారం) కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. దారి పొడవునా కోడుమూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

కోడుమూరు నియోజకవర్గం పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు, రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం, వెంకయ్యపల్లి, రాంభూపాల్ నగర్, మిలటరీ కాలనీ, తాండ్రపాడు మీదుగా గార్గేయపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, మైనారిటీలు, ఈడిగలు, వృద్ధులు, వికలాంగులు లోకేశ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 

గార్గేయపురం శివార్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జలాశయం వద్ద లోకేశ్ సెల్ఫీ దిగారు. అడుగడుగునా యువనేతను చూసేందుకు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం పోటీపడ్డారు. పార్టీ కార్యకర్తలు గజమాలలతో లోకేశ్ ను సత్కరించారు. 

బి.తాండ్రపాడు గ్రామస్తులు యువనేతకు వినతిపత్రం సమర్పిస్తూ తమ గ్రామంలో పురాతన కాలంలో సువిశాలమైన చెరువును ఎమ్మెల్యే బినామీలు పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 

కరవుసీమకు జలకళ... చంద్రన్న దార్శనికత!

గార్గేయపురం చెరువు వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హంద్రీనది చెంతనే ఉన్నా గుక్కెడు నీళ్లివ్వల్లేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అయితే, వర్షపునీటిని ఒడిసిపట్టి రాయలసీమకు జలకళ తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రన్న అని కీర్తించారు. 

"కరవుసీమలో కళకళలాడుతున్న ఈ జలాశయం కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం శివార్లలో ఉంది. కొండల్లో నుంచి వచ్చే వర్షపునీటికి చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా అడ్డుకట్టవేసి, సుందరమైన సరస్సుగా మార్చారు చంద్రబాబునాయుడు. ఈ ప్రాంతంలో ఆహ్లాదమైన బోటింగ్ ఏర్పాటుచేసి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేశారు. చంద్రబాబు గారి దార్శనికతకు ఇదొక మచ్చుతునక మాత్రమే" అని లోకేశ్ వివరించారు.  

యువనేతను కలిసిన దళితులు

కోడుమూరు నియోజకవర్గం వెంకయ్యపల్లి దళితులు యువనేత లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి అని విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీలకు సంక్షేమం, రక్షణ రెండూ కరువయ్యాయని విమర్శించారు. గత నాలుగేళ్లలో రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన దళితద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తుంటే, అలాంటి వారికి వైసీపీ నాయకులు సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తున్నారని ఆరోపించారు. 

"దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న దుర్మార్గపు పాలన జగన్ ది. గత టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. ఎస్సీలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్సీ రైతులకు గతంలో మాదిరి పూర్తి సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తాం. ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం" అని లోకేశ్ భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1189 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.5 కి.మీ.*

*95వ రోజు (10-5-2023) యువగళం వివరాలు:*

*నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)*

ఉదయం

7.00 – గార్గేయపురం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.10 – నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రవేశం.

8.15 – బ్రాహ్మణకొట్కూరులో ఎస్సీలతో సమావేశం.

8.40 – బ్రాహ్మణకొట్కూరు శివాలయం వద్ద ముస్లింలతో సమావేశం.

9.00 – కోళ్లబోవపురం క్రాస్ వద్ద ఎస్టీలతో సమావేశం.

9.40 – వడ్డెమూరులో బోయలతో సమావేశం.

10.00 – కోనేటమ్మపల్లి క్రాస్ వద్ద సర్పంచ్ లతో సమావేశం.

10.40 – అల్లూరులో గోళ్ల సామాజికవర్గీయులతో సమావేశం.

11.10 – అల్లూరులో 1200 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

11.25 – అల్లూరు శివార్లలో భోజనవిరామం.

సాయంత్రం

4.00 – అల్లూరు శివార్లనుంచి పాదయాత్ర ప్రారంభం.

5.30 – నందికొట్కూరులోని ఎన్ఎస్ ఫంక్షన్ హాలువద్ద బహిరంగసభ.

6.45 – మార్కెట్ యార్డు సర్కిల్ లో రైతులతో సమావేశం.

7.10 – సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం.

7.25 – పటేల్ సెంటర్ లో గౌడ సామాజికర్గీయులతో సమావేశం.

7.55 – నందికొట్కూరు శివారు విడిది కేంద్రంలో బస.

More Telugu News