kalvakuntla Kavitha: మెడికో ప్రీతి తల్లిదండ్రులకు కల్వకుంట్ల కవిత లేఖ

  • కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి
  • చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న కవిత
  • ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడి
Kalvakuntla Kavitha wrote medico Preethi parents

ర్యాగింగ్ భూతానికి, సీనియర్ల వేధింపులకు బలైన మెడికో ప్రీతి తల్లిదండ్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. గౌరవనీయులైన నరేందర్-శారద గారికి... సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని కవిత తెలిపారు. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని వెల్లడించారు. 

ప్రీతి కోలుకోవాలంటూ గత మూడ్రోజులుగా కోరుకున్న కోట్లాదిమందిలో తాను కూడా ఉన్నానని కవిత పేర్కొన్నారు. "ఎన్నో కష్టాలకు ఓర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. ఈ సందర్భంగా కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. 

మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటాయి. మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుంది. 

యావత్ రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అంటూ కవిత తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News