అందరినీ మట్టికరిపిస్తాం... హ్యాట్రిక్ కొడతాం: మంత్రి కేటీఆర్

KTR slams BJP leaders in Narayanapet
  • నారాయణపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన
  • ప్రగతి నివేదన కార్యక్రమానికి హాజరు
  • ధరలు పెంచినందుకు మోదీ దేవుడయ్యాడా అంటూ ఆగ్రహం 
  • పాలమూరుకు నీళ్లందించే బాధ్యత తమదేనని స్పష్టీకరణ
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీజేపీపై ధ్వజమెత్తారు.

పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారని, ఓవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తూ, ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతారని కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకు మోదీ దేవుడయ్యాడా? అంటూ విమర్శించారు. 

పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం ఆటంకాలు కలిగించినా, పనులు పూర్తిచేసి పాలమూరు రైతాంగానికి నీళ్లు అందించే బాధ్యత కేసీఆర్ సర్కారుదేనని పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపోరాటాలు చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ తేల్చుకుంటామని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో అందరినీ మట్టికరిపించి, 2024లో కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరిట పంచాయితీ పెట్టే వారిని తిప్పికొడదామని అన్నారు.
Advertisement
KTR
Narayanapet
BRS
BJP

More Telugu News