Putta Sudhakar Yadav: తిరుమల క్షేత్రంలో దోచుకుంటున్నారు: పుట్టా సుధాకర్ యాదవ్

  • తిరుమలలో గదుల అద్దె పెంపు
  • జగన్ రెడ్డి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాడన్న పుట్టా 
  • గదుల ఆధునికీకరణ బ్రహ్మాండంగా ఏమీ లేదని విమర్శలు
TTD former chairman Putta Sudhakar Yadav fires on YCP govt

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా జగన్ రెడ్డి తన దోపిడీకి నెలవుగా చేసుకున్నాడని, తన పరివారంతో కలిసి భక్తుల్ని నిలువునా దోచుకుంటున్నాడని టీటీడీ మాజీ ఛైర్మన్, మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. జగన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపారకేంద్రంగా మార్చాడని, భక్తుల వసతిగదుల అద్దెను రూ.150 నుంచి రూ.1700... రూ.200 నుంచి రూ.2,200కు పెంచాడని మండిపడ్డారు. 

గతంలో గది అద్దెలు రూ.50 నుంచి రూ.200 మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు విపరీతంగా అద్దెలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గదులేమైనా బ్రహ్మండంగా ఆధునికీకరించారా అంటే అదీలేదని విమర్శించారు. 

"గదుల కోసం భక్తులనుంచి తీసుకునే అడ్వాన్స్ సొమ్ముని తిరిగివ్వడం మానేశారు. లడ్డూ ప్రసాదం ధర గతంలో రూ.20 ఉంటే, ఇప్పుడు రూ.50 చేశారు. కల్యాణ లడ్డూ ధరను రూ.200లకు పెంచారు. గతంలో  మధ్యతరగతి, సామాన్య భక్తులకు గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం లభించేది. భక్తులు వచ్చిన తేదీ ప్రకారం వారికి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనభాగ్యం కలిగేది. ఇంతకుముందు తిరుమల వెళ్తున్నాం... ఫలానా రోజుకి కచ్చితంగా వచ్చేస్తామనే నమ్మకం భక్తుల్లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దర్శనం కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది" అని అన్నారు. 

స్వామివారికి భక్తులు సమర్పించే విలువైన కానుకలు, ఇతరత్రా ఆస్తులు, భూములకు సంబంధించిన లెక్కల్లో అన్నీ లోపాలేనని... విరాళాలు, కానుకలు, ఆస్తులు సమర్పించే భక్తులకు కూడా టీటీడీ సరైన సమాధానం ఇవ్వడంలేదని పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు.   

గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని నానా యాగీచేశారని, ఆ ప్రబుద్ధులంతా పింక్ డైమండ్ ఇప్పుడు ఎక్కడుందో, ఎవరింట్లో దాచారో చెప్పగలరా? అని నిలదీశారు.  

"ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కూడా ఈ ప్రభుత్వం వసూళ్ల పర్వంగా మార్చింది. వైకుంఠ ఏకాదశి పేరుతో 10 రోజుల పాటు, భక్తుల నుంచి అధికమొత్తంలో వసూళ్లు చేసి, దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముసుగులో భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు" అని విమర్శించారు. 

హిందూధర్మం, శాస్త్రాలు తెలియని వ్యక్తి ఛైర్మన్ కావడమే ఇన్ని అనర్థాలకు మూలం అని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మం, శాస్త్రాలు తెలిసిన వ్యక్తి, టీటీడీ ఛైర్మన్ అయి ఉంటే, తిరుమలకు ఈ దుర్గతి దాపురించేది కాదని అన్నారు. ఇకనైనా టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సకాలంలో వారికి స్వామిదర్శనం లభించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే గదుల అద్దెలు తగ్గించి, భక్తుల అడ్వాన్స్ సొమ్ము  తిరిగివ్వాలి” అని సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు.

More Telugu News