Anjani Kumar: పదవీ విరమణ చేస్తున్న మహేందర్ రెడ్డి... ఇన్చార్జి డీజీపీగా అంజనీకుమార్

  • ఈ నెల 31తో ముగియనున్న డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం
  • పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి
  • ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్
Anjani Kumar appointed as Incharge DGP of Telangana

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి కలిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఎల్లుండి (డిసెంబరు 31) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో... ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీకుమార్ రాష్ట్రస్థాయిలో పోలీసు విభాగంలో పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు. రవి గుప్తాకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

ఇక, సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్ ను నియమించారు. మహేశ్ భగవత్ ఇప్పటిదాకా రాచకొండ పోలీస్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆయన పదోన్నతిపై వెళుతుండడంతో రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ ను నియమించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News