TPCC President: రేవంత్ పై సీనియర్ల తిరుగుబాటుతో కాంగ్రెస్ లో కలకలం.. రంగంలోకి అధిష్ఠానం!

  • కొత్త కమిటీ ఎంపికతో తారస్థాయికి విభేదాలు
  • రేవంత్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్ల నిర్ణయం
  • ఢిల్లీ రావాలని సీనియర్లకు అధిష్ఠానం పిలుపు
Seniors revolt against Revanth reddy

కాంగ్రెస్ లో వివిధ స్థాయి నేతల మధ్య విభేదాలు, అసంతృప్తులు సహజం. చాలా మంది నేతలు బహిరంగంగానే పార్టీ పెద్దలను విమర్శిస్తుంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలువురు సీనియర్లు తిరుగుబాటు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రకటించిన కొత్త పీసీసీ కమిటీల వివాదం తేల్చేవరకు రేవంత్ కార్యక్రమాలను బాయ్‌కాట్ చేయాలని సీనియర్లు నిర్ణయించారు. ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్లు  ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పార్టీలో ముందునుంచి ఉన్న నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే పదవులు ఇవ్వడంపై భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, మధు యాష్కి తదితరులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

దీనికి రేవంత్ రెడ్డినే కారణం అని, ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారు. రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శులు రాష్ట్రానికి రానున్నారు. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్ నుంచి నివేదిక కోరినట్టు, రేవంత్ పై తిరుగుబాటు ప్రకటించిన సీనియర్లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదం ఎంత దూరంలో వెళ్తుందో చూడాలి.

More Telugu News