Advertisement

2014 నాటి సీన్ రిపీట్ అవుతుందని జగన్ వణుకుతున్నాడు: చంద్రబాబు

Chandrababu says Jagan afraid of 2014 election scenario
  • పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • జంగారెడ్డి గూడెంలో బీసీ సంఘాలతో సమావేశం
  • 2024లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా
  • పిరికి ముఖ్యమంత్రికి టీడీపీ చుక్కలు చూపిస్తుందంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు ఆయన జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిందని, ఇప్పుడదే సీన్ 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందని జగన్ వణికిపోతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

సిగ్గుమాలిన ముఖ్యమంత్రి... ఆడపిల్లల చున్నీలు కూడా తీసేయించిన ఈ పిరికి ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపించడం తథ్యం అని స్పష్టం చేశారు. బీసీలను ఉద్దరించానంటున్న జగన్ రెడ్డీ... ఆయా సామాజికవర్గాల్లో ఉన్న జనాభా ఎంత, ఇస్తున్న సాయం ఎంతమందికి? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. 

"స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాం. కానీ ఈ జగన్ రెడ్డి ఆ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించాడు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్లు కేటాయించి.. రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ.. ఈ జగన్ రెడ్డి అందరికీ ఖర్చు చేసిన నిధులను బీసీలకు చేసినట్లు చెబుతున్నాడు. 

నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అన్న జగన్ రెడ్డి.. టీటీడీలో 37 మంది సభ్యులుంటే... రిజర్వేషన్ కింద ఇచ్చింది ముగ్గురికి. ఇదేనా 50 శాతం రిజర్వేషన్? రాష్ట్రంలో 12 యూనివర్శిటీలుంటే... టీడీపీ హయాంలో 9 వర్శిటీలకు వీసీలుగా బీసీలను నియమించాం. ప్రస్తుతం 10 యూనివర్శిటీల వీసీలు రెడ్లే, చివరికి వీసీలతో పాటు రిజిస్ట్రార్లుగా కూడా సొంత వర్గంతో నింపుకున్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ వర్శిటీకి కూడా రెడ్డి పేరు పెట్టుకున్నారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా.. ముఖ్యమంత్రి, డీజీపీ, సీఎస్ ఇలా మొత్తం వ్యవస్థ నిండా ఒక వర్గమే ఉంది. సలహాదారుల్లోనూ మొత్తం వారే. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ మొత్తం వారే. రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు రాసిచ్చేసి.. వారితో రాష్ట్రంపై పెత్తనం చేయిస్తున్నారు" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

"26 మంది బీసీ నాయకులను హత్య చేశారు. వందలాది మందిపై దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఇదేనా బీసీ సంక్షేమం? ఎవరో ఇద్దరి మధ్య గొడవలో హత్య జరిగితే కొల్లు రవీంద్రను జైల్లో పెట్టారు. ఫిర్యాదులో పేరు లేకపోయినా అయ్యన్నపై కేసు పెట్టారు. పెళ్లికి వెళ్లినందుకు యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. ఫొటో తీయడాన్ని ప్రశ్నించినందుకు 70 ఏళ్ల వయసున్న అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు. 

56 కార్పొరేషన్లు పెట్టాను అంటున్న జగన్ రెడ్డి.. ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు చేశాడో సమాధానం చెప్పగలడా? జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని గుర్తించే కొంత మంది ఛైర్మన్లు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. 54 సాధికార కమిటీ సభ్యులు ప్రజల్లోకి వెళ్లి.. జగన్ రెడ్డిని ఉతికి ఆరేయండి. జగన్ రెడ్డి చేస్తున్న దగా, దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాష్ట్ర భవిష్యత్తును పునర్ నిర్మించుకుందాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu
Jagan
TDP
YSRCP
West Godavari District
Andhra Pradesh

More Telugu News