Srisailam: నిండు కుండల్లా మారిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు.. గేట్ల ఎత్తివేత

  • కృష్ణానదికి పోటెత్తుతున్న వరద నీరు
  • 884 అడుగులకు చేరుకున్న శ్రీశైలం నీటిమట్టం
  • నాగార్జునసాగర్ కు చెందిన 14 గేట్ల ఎత్తివేత
Srisaila and Nagarjuna Sagar dams fully filled with water

భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. నదిపై ఉన్న జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు జలాశయాల్లోని నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ కు 1,66,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ఔట్ ఫ్లో 2,53,260గా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. కుడి, ఎడుమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 

మరోవైపు నాగార్జునసాగర్ కూడా నిండుకుండలా మారింది. 2,53,240 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... ఔట్ ఫ్లో 2,52,957గా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. అధికారులు 14 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మరోవైపు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న నేపథ్యంలో... ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

More Telugu News