Mani Ratnam: మ‌ణిర‌త్నం 'పీఎస్‌1'కు తొలి రోజు భారీ వ‌సూళ్లు

  • త‌మిళ‌నాడులో రూ. 25.86 కోట్లు
  • అమెరికా, ఆస్ట్రేలియాలోనూ దూసుకెళ్తున్న చిత్రం
  • మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా వ‌సూళ్ల‌లో దూకుడు
Ponniyin Selvan box office collection Day 1

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం క‌ల‌ల చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్ (పీఎస్‌1). చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంపై ద‌క్షిణాదిలో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పాన్ ఇండియా స్థానంలో నిన్న వివిధ భాష‌ల్లో విడుద‌లైంది. మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్నప్ప‌టికీ ఈ చిత్రం తొలి రోజు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ 'పీఎస్‌1'కి భార‌త్‌తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

ముఖ్యంగా త‌మిళ‌నాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ల‌భిస్తోంది. తొలి రోజు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. తమిళనాడులో 25.86 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వాలిమై (రూ. 36.17 కోట్లు), బీస్ట్ (రూ. 26.40 కోట్లు) త‌ర్వాత మూడో స్థానంలో నిలిచింది. హిందీ సర్క్యూట్ సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లను నమోదు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. 

అమెరికాలో 'పీఎస్‌1' దూసుకెళ్తోంద‌ని ట్రేడ్ ఎన‌లిస్ట్‌ రమేష్ బాలా తెలిపారు. యూఎస్ఏలో వ‌రుస‌గా రెండు రోజులు ఒక మిలియ‌న్ మార్క్ వసూళ్లు రాబ‌ట్టిన తొలి త‌మిళ‌ చిత్రంగా నిలిచింద‌ని తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా అత్య‌ధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింద‌న్నారు. కాగా, పొన్నియిన్ సెల్వన్ రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. మ‌రిన్ని పార్టులు కూడా ఉన్నాయి.

More Telugu News