Tollywood: మిస్ ఇండియా పోటీ నుంచి త‌ప్పుకున్న రాజ‌శేఖ‌ర్ కూతురు!.. కార‌ణ‌మేంటంటే..!

  • త‌మిళ‌నాడు కేట‌గిరీలో మిస్ ఇండియా పోటీల‌కు శివానీ
  • ప్ర‌స్తుతం వైద్య విద్య‌న‌భ్య‌సిస్తున్న రాజ‌శేఖ‌ర్ కూతురు
  • బుధ‌వారం నుంచే ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయ‌న్న న‌టి
  • ఇటీవ‌లే మ‌లేరియాతో బాధ‌ప‌డ్డ‌ట్టు వెల్ల‌డి
  • ఈ కార‌ణంగానే మిస్ ఇండియా పోటీల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
Rajasekhar daughter shivani escapes Miss India pageant

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖర్ కుమార్తె, ఇప్పుడిప్పుడే సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటున్న శివానీ రాజ‌శేఖ‌ర్ మిస్ ఇండియా పోటీల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఈ పోటీల నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. తాను మిస్ ఇండియా పోటీల నుంచి త‌ప్పుకోవడానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ఆమె వెల్ల‌డించారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకే చెందిన శివానీ మిస్ ఇండియా పోటీల‌కు మాత్రం త‌మిళ‌నాడు కేట‌గిరీలో ఎంపిక‌య్యారు. 

శివానీ ప్ర‌స్తుతం వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన షెడ్యూల్ కంటే ముందుగానే బుధ‌వార‌మే ఆమెకు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయ‌ట‌. అంతేకాకుండా ఇటీవ‌లే తాను మ‌లేరియా బారిన ప‌డిన‌ట్టు చెప్పారు. మ‌లేరియా వ‌ల్ల కొంత అనారోగ్యం, ప‌రీక్ష‌ల వ‌ల్ల శిక్ష‌ణ‌, గ్రూమింగ్ సెష‌న్స్, స‌బ్ కాంటెస్ట్‌ల‌లో పాల్గొన‌లేక‌పోయాన‌ని ఆమె తెలిపారు. అయినా కూడా గ‌తంలో మాదిరిగా నేరుగా ప్ర‌ధాన పోటీల్లోనే పాల్గొనాల‌ని భావించిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. ఇక మిస్ ఇండియాలో ఫైన‌ల్ పోటీ గ్రాండ్ ఫినాలే జ‌రిగే రోజైన జులై 3న కూడా త‌న‌కు ప‌రీక్ష ఉంద‌ని, ఈ కార‌ణంగానే తాను మిస్ ఇండియా పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

More Telugu News