ఇంకా అనేకమంది ప్రాంతీయ నేతలను కలుస్తా: సీఎం కేసీఆర్

CM KCR talks to media after meeting with Uddhav Thackeray
  • ముగిసిన కేసీఆర్, థాకరే సమావేశం
  • సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు
  • అనేక అంశాలపై లోతుగా చర్చించామన్న కేసీఆర్
  • దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని వెల్లడి
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. అనంతరం, కేసీఆర్, థాకరే సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకే ముంబయి వచ్చానని తెలిపారు. ఇరువురి మధ్య లోతైన చర్చ జరిగిందని, అనేక అంశాలపై సమాలోచనలు చేశామని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో మరిన్ని చర్చలు జరుపుతామని చెప్పారు. ఇంకా అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని తెలిపారు. హైదరాబాద్ రావాలని సీఎం ఉద్ధవ్ థాకరేను కోరుతున్నానని అన్నారు. రెండు రాష్ట్రాలు అనేక అంశాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిలషించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాల్సిందేనని స్పష్టం చేశారు.

కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఉద్ఘాటించారు.
Go Back to Shorts
CM KCR
Uddhav Thackeray
Telangana
Maharashtra
TRS
Shiv Sena

More Telugu News