Ravichandran Ashwin: ఆఫ్ఘ‌న్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి: టీమిండియా సెమీస్ ఆశ‌ల‌పై అశ్విన్

  • టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో స్కాట్లాండ్‌తో నేడు టీమిండియా మ్యాచ్
  • మిగ‌తా మ్యాచులు గెలిచినా సెమీస్ చేరడం క‌ష్ట‌మే
  • ఆఫ్ఘ‌న్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే భార‌త్ సెమీస్ చేరే చాన్స్‌
  • ఆఫ్ఘ‌న్‌కే భార‌తీయుల మ‌ద్ద‌తు అన్న అశ్విన్
  • సెమీస్‌కు చేరే విషయంపై టీమ్‌లో మాత్రం ఎలాంటి చర్చలు లేవ‌ని వ్యాఖ్య‌
ashwin on today match

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో స్కాట్లాండ్‌తో టీమిండియా నేడు మ్యాచ్ ఆడ‌నుంది. తొలి రెండు మ్యాచుల్లో పాక్‌, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా ఆ త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్థాన్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచులో గెలిచిన విష‌యం తెలిసిందే. టీమిండియా ఆ ప్ర‌పంచ క‌ప్‌లో క‌నీసం సెమీస్ కు చేరుతుందా? అన్న విష‌యంపైనే అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

దీనిపై సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ స్పందిస్తూ.. సెమీస్‌కు చేరే విషయంపై టీమ్‌లో మాత్రం ఎలాంటి చర్చలు జరగట్లేదని చెప్పాడు. ప్ర‌స్తుతం తమ దృష్టి అంతా మిగిలిన మ్యాచుల్లో ఎలా గెలవాలనే దానిపైనే ఉందని అన్నాడు. చివరి రెండు మ్యాచుల్లో జ‌ట్టులోని ప్రతి ఒక్కరూ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల‌నే భావిస్తున్నార‌ని తెలిపాడు.

మ్యాచులో ఎవరు ఎలా ఆడతారనేది తమ చేతుల్లో లేదని చెప్పాడు. అయినప్ప‌టికీ ప్రదర్శన అత్యుత్త‌మంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు. టీమిండియా సెమీస్ వెళ్లాలంటే మిగిలిన మ్యాచుల్లో గెల‌వ‌డ‌మే కాకుండా న్యూజిలాండ్ ఆఫ్ఘ‌న్ చేతిలో ఓడిపోవాలి. దీంతో తాము ఆ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకున్నట్లు అశ్విన్ అన్నాడు.

ఈ నేప‌థ్యంలో ఆఫ్ఘ‌న్‌కు భారత క్రికెట్ అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందని, న్యూజిలాండ్‌ను ఆ జ‌ట్టు ఓడించాల‌ని కోరుకుంటార‌ని చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఆఫ్ఘ‌న్ పోరు ఆసక్తిక‌రంగా ఉంటుందని అన్నాడు. ఆఫ్ఘ‌న్ జ‌ట్టుకు ఆయ‌న‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

తాను నాలుగేళ్ల తర్వాత  టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి రావడం ప‌ట్ల అశ్విన్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. భార‌త గెలుపులో మంచి పాత్ర పోషించాలని కలలుకన్నట్లు తెలిపాడు. పాక్‌, న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవ‌డంతో జ‌ట్టు నిరాశ చెందింద‌ని అన్నాడు. అయితే, ఆఫ్ఘ‌న్‌తో గెల‌వ‌డంతో మ‌ళ్లీ ఉత్సాహం వ‌చ్చింద‌ని వివ‌రించాడు.

More Telugu News