Turkey: 10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ అధ్యక్షుడు

  • పౌర హక్కుల కార్యకర్త కవాలాను విడుదల చేయాలంటూ ఆ దేశాల ప్రకటన
  • ఆగ్రహం వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు
  • టర్కీని అర్థం చేసుకోని వారు అవసరం లేదని మండిపాటు
Turkey To Expel 10 Countries Ambassadors

జైలులో ఉన్న సామాజిక కార్యకర్తను విడుదల చేయాలన్న దేశాల రాయబారులను టర్కీ బహిష్కరించింది. అమెరికా, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ దేశాల రాయబారులను బహిష్కరించాల్సిందిగా విదేశాంగ శాఖను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆదేశించారు. పౌర హక్కుల కార్యకర్త  అయిన ఉస్మాన్ కవాలాను 2013లో దేశవ్యాప్త అల్లర్లు, ఆందోళనలకు కారకుడయ్యాడని, 2016లో మళ్లీ అలాంటి ఆందోళనలకు ప్రయత్నించారన్న కారణంతో ఎర్డోగాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నాలుగేళ్లుగా ఆయన జైలులోనే ఉంటున్నారు.

కవాలను త్వరగా విడుదల చేయాలని, కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ఆ పది దేశాల రాయబారులు సంయుక్త ప్రకటన చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన టర్కీ విదేశాంగ శాఖ.. ఆయా దేశాల రాయబారులకు సమన్లను ఇచ్చింది. వారెవరూ అవసరం లేదని, వారిని దేశం నుంచి పంపించేయాలని విదేశాంగ శాఖను ఆదేశించానని ఎర్డోగాన్ ప్రకటించారు.

అప్పుడే వారంతా టర్కీ అంటే ఏంటో తెలుసుకుంటారని, అర్థం చేసుకోలేని నాడు వారెవరూ దేశంలో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమవుదామనుకున్నానని, కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నానని స్పష్టం చేశారు. అయితే, బహిష్కరణ గురించి తమకు ఇంత వరకూ ఎలాంటి నోటీసులు అందలేదని కొన్ని యూరప్ దేశాలు ప్రకటించాయి.

నేరం నిరూపణ కాకపోయినా 2017 నుంచి కవాలాను టర్కీ ప్రభుత్వం జైలులో నిర్బంధించిందన్న ఆరోపణలున్నాయి. తనను ఈ ప్రభుత్వం విడిచిపెట్టే సూచనలు కనిపించట్లేదని గత వారం కవాలా జైలు నుంచి ఓ సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విదేశీ శక్తులతో ప్రతిపక్షాలు చేతులు కలిపాయని ఆరోపిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి 2013లో ఇస్తాంబుల్ లోని గెజి పార్కులో జరిగిన ఆందోళనలకు సంబంధించిన కేసులో కవాలాను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆ వెంటనే 2016లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్ట్ చేయించింది.

దీనిపై యూరోపియన్ మానవ హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఉస్మాన్ కవాలాను విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. యూరోపియన్ యూనియన్ లో ఓటింగ్ హక్కును కోల్పోవాల్సి వస్తుందని తేల్చి చెప్పాయి. అయినా కూడా ఎర్డోగాన్ పట్టించుకోలేదు.

More Telugu News