Andhra Pradesh: డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలు.. వారిపైనే మరో కేసు పెట్టిన పోలీసులు

  • డీజీపీ ఆఫీసు గేట్లు నెట్టివేసేందుకు ప్రయత్నించారని ఏఎస్ఐ ఫిర్యాదు
  • డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని కేసు
  • తాడేపల్లి స్టేషన్ లో ఎఫ్ఐఆర్
AP Police Files Yet Another Case Against TDP Leaders As they were Tried To Meet DGP

టీడీపీ నేతలపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఇవాళ డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. అయితే, భారీగా తరలివచ్చిన నేతలు డీజీపీ ఆఫీసు గేటును నెట్టివేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ తాడేపల్లి ఏఎస్ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, నజీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారంతా డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. తాజాగా కొత్త కేసుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News