తత్కాల్ టికెట్ల కోసం పశ్చిమ మధ్య రైల్వే కొత్త రూల్స్.. ఆగస్టు 1 నుంచి మారనున్న టోకెన్ల విధానం!

West Central Railway new rules for Tatkal tickets and token system from August 1
  • పశ్చిమ మధ్య రైల్వేలో తత్కాల్‌ టికెట్లపై కొత్త టోకెన్ విధానం
  • ఏసీ, నాన్-ఏసీ టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు
  • టోకెన్ల కోసం ఆధార్, ఫోటో ఐడీ తప్పనిసరి
  • కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్న రైల్వే అధికారులు
రైల్వే స్టేషన్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలలో వేచి చూసే ప్రయాణికులకు పశ్చిమ మధ్య రైల్వే ఊరటనిచ్చే వార్తను అందించింది. కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించడంతో పాటు, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం సవరించిన టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

నూతన నిబంధనల ప్రకారం, ఏసీ క్లాసుల కోసం ఉదయం 8:30 నుంచి 9:00 గంటల మధ్య, నాన్-ఏసీ (స్లీపర్) క్లాసుల కోసం ఉదయం 9:00 నుంచి 9:30 గంటల మధ్య టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్‌లో ఏసీ క్లాసుకు గరిష్ఠంగా 10, నాన్-ఏసీకి 15 టోకెన్లు కేటాయిస్తారు. అయితే, రద్దీ తీవ్రతను బట్టి ఈ సంఖ్యను సవరించే అధికారం స్థానిక అధికారులకు ఉంటుంది. గతంలో టోకెన్లు ఆలస్యంగా జారీ చేయడం వల్ల ప్రయాణికులు రెండుసార్లు కౌంటర్‌కు రావాల్సి వచ్చేది. కొత్త సమయాల వల్ల ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది.

టోకెన్ల జారీలో పారదర్శకతను పెంచేందుకు, బ్లాక్ మార్కెటింగ్‌‌కు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కఠిన నిబంధనలను రూపొందించారు. టోకెన్ పొందే ప్రయాణికులు తమ ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ టోకెన్లు బదిలీ చేయడానికి వీలుండదు. స్వయంగా ప్రయాణించే వారికి లేదా తమ కుటుంబ సభ్యులకు టికెట్లు బుక్ చేసుకునే వారికి (కేటగిరీ-ఏ) మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు.

ఈ మార్పులను కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ ధృవీకరించారు. కౌంటర్ల వద్ద తత్కాల్ బుకింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే ఈ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Advertisement
West Central Railway
Tatkal ticket booking rules
Indian Railways new guidelines
Tatkal token system change
Aadhaar card for railway tickets
Railway counter booking updates

More Telugu News