Shiv Sena: మా రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఎన్న‌డూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు: బీజేపీపై శివ‌సేన ఫైర్

shivsena slams bjp
  • శివసేన భవనం కూల్చేయాలన్న బీజేపీ నేత ప్రసాద్ లాడ్ 
  • సామ్నాలో మండిప‌డ్డ శివ‌సేన‌
  • ఒక‌ప్పుడు బీజేపీలో విధేయులైన కార్యకర్తలు   ఉండేవార‌ని వ్యాఖ్య‌
  • విలువలున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలో లేరని కామెంట్ 
శివసేన భవనం కూల్చేయాలంటూ బీజేపీ నేత ప్రసాద్ లాడ్ చేసిన వ్యాఖ్యలపై శివ‌సేన పార్టీ మండిపడుతూ, తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ నేతల తీరు వ‌ల్ల‌ ఆ పార్టీ భ‌విష్య‌త్తులో క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి క‌న‌ప‌డుతోంద‌ని శివ‌సేన త‌న అధికార ప‌త్రిక సామ్నాలో పేర్కొంది.

త‌మ పార్టీతో కొందరికి రాజకీయ ప‌రంగా విభేదాలు ఉండొచ్చని, అలాగే త‌మ పార్టీని విమర్శించవ‌చ్చ‌ని, అంతమాత్రాన ఇలా శివసేన భవనాన్ని కూల్చేయాలని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎవరూ అనలేదని విమర్శించింది.

బాలా సాహెబ్ థాకరేతో పాటు ఛత్రపతి శివాజీ కొలువై వున్న భవనమదని, కాషాయ ధ్వజం సైతం అందులో ఎగురుతుంటుందని శివ‌సేన చెప్పింది. బీజేపీలో ఒకప్పుడు విధేయులైన కార్యకర్తలు ఉండేవార‌ని, ఇప్పుడు మాత్రం బీజేపీ మారిపోయింద‌ని, నిజమైన సైద్ధాంతిక విలువలున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలో లేరని దెప్పిపొడిచింది. శివసేన భవనం కూల్చేయాలని బీజేపీ నేత ప్రసాద్ లాడ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు శివ‌సేన నేత‌లు కూడా మండిప‌డుతు‌న్నారు.
Shiv Sena
BJP
Maharashtra

More Telugu News