Maharashtra: కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయి.. బీజేపీతో చేతులు కలుపుదాం

let us join with BJP to escape from central agencies harrassment
షార్ట్స్‌లో చూడండి
శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు శివసేన నేతల్ని వేధిస్తున్నాయని ఆరోపించారు. వాటి నుంచి నాయకుల్ని కాపాడేందుకు శివసేన వెంటనే బీజేపీతో చేతులు కలపాలంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు లేఖ రాశారు. గతంలో బీజేపీ, శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం సీటుపై వివాదం నెలకొని ఇరు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయి. తర్వాత కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివసేన.. ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

అలాగే ముంబయి, థానేలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. వాటిలో సహకారం కోసమైనా బీజేపీతో సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని సర్నాయక్‌ హితవు పలికారు. ప్రస్తుతం ఇరు పార్టీలు మిత్రపక్షాలు కాకపోయినప్పటికీ.. బీజేపీకి చెందిన అనేక మంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకొని బీజేపీకి దగ్గర కావాలని సూచించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ కొంత మంది పేర్లను కూడా సర్నాయక్‌ లేఖలో ప్రస్తావించారు. వారందరినీ కాపాడేందుకు వెంటనే మోదీతో చేతులు కలపాలన్నారు. గత ఏడాది సర్నాయక్‌కు చెందిన పలు ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ తనిఖీలు నిర్వహించింది. ఆయన కుమారుడు విహంగ్‌ సర్నాయక్‌ని కూడా అధికారులు ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మిత్రపక్షాలపై సర్నాయక్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనుందని తెలిపారు. అలాగే మరో భాగస్వామ్య పక్షం ఎన్సీపీ.. శివసేన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌,  ఎన్సీపీలను బలపర్చడానికే బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుందా అని శివసేన ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారన్నారు.

దీనిపై స్పందించిన బీజేపీ నేత కిరిట్‌ సోమయ.. జైలుకు వెళతానన్న భయంతోనే సర్నాయక్‌ ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అలాగే గత 100 రోజులుగా సర్నాయక్‌ కనిపించకుండా పోవడంతో థానేలోని ఓ పోలిస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశానని తెలిపారు.
Go Back to Shorts
Maharashtra
BJP
Congress
Shiv Sena
Uddhav Thackeray

More Telugu News