Nara Rohit: ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసినందుకు వందనం: నారా రోహిత్

  • నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి
  • ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది
  • తెలుగుజాతి ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది
Nara Rohit supports vizag steel plant protests

సినీ నటుడు నారా రోహిత్ విశాఖ ఉక్కు ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు. త్వరలోనే విశాఖకు వచ్చి ఉద్యమానికి మద్దతు పలుకుతానని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవంపై దాడి జరుగుతోందని  అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు.

'నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ! ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి. ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనం.

తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు . సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు అండగా నిలబడతా. తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోంది. యువతా..మేలుకో. నీ పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకు. త్యాగధనుల పోరాటఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా. త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతా' అని నారా రోహిత్ అన్నారు.

More Telugu News