Bollywood: రైతులకు అండగా బాలీవుడ్ నటులు.. రైతులను సైనికులుగా అభివర్ణించిన ప్రియాంక చోప్రా!

  • సంక్షోభానికి త్వరగా పరిష్కారం లభించాలి: ప్రియాంక
  • వారి ఆందోళనతో నా హృదయం ద్రవించిపోతోంది: ప్రీతి జింటా
  • నేను రైతుల పక్షానే నిలబడతా: రితేశ్ దేశ్‌ముఖ్
Bollywood coming forward to support farmers

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ నటులు కూడా ఓ అడుగు ముందుకేసి రైతులకు అండగా నిలుస్తున్నారు. వారి ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇప్పటికే రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించగా తాజాగా, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి ఆహారాన్ని అందించే సైనికులుగా రైతులను అభివర్ణించిన ప్రియాంక.. ఇలాంటి సంక్షోభానికి వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనాకు కూడా కలత చెందకుండా రైతులు తమ కుటుంబ సభ్యులతో వణికించే చలిలో ఉద్యమం చేస్తున్నారని, వారి ఆందోళనకు తన హృదయం ద్రవించిపోతోందని మరో నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా రైతులకు మద్దతుగా ముందుకొచ్చాడు. తాను రైతుల పక్షాన నిలబడతానని పేర్కొన్నాడు. నేడు మనం అన్నం తింటున్నామంటే రైతుల చలవేనన్నాడు. అలాగే, తాప్సి, సోనమ్ కపూర్, దివ్యాదత్తా, పరిణీతి చోప్రా వంటి వారు కూడా రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

More Telugu News