Kangana Ranaut: పట్టువదలకుండా మరోసారి సమన్లు పంపిన పోలీసులు... బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగన

  • సుశాంత్ మృతి నేపథ్యంలో కంగన ట్వీట్లు
  • కంగనకు తోడు ఆమె సోదరి కూడా విమర్శలు చేసిన వైనం
  • కంగనపై ఫిర్యాదు చేసిన ఫిట్ నెస్ ట్రైనర్
Mumbai Police issues fresh summons as Kangana went to Bombay High Court

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ తీరుతెన్నులపైనా, ముంబయి పోలీసుల విచారణ తీరుపైనా నటి కంగన రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కంగనకు తోడు ఆమె సోదరి రంగోలి చందేల్ కూడా ట్విట్టర్ లో అదేపనిగా విమర్శలు గుప్పించింది. దాంతో కంగన, రంగోలిపై ఫిట్ నెస్ ట్రైనర్ మున్వర్ అలీ సయ్యద్  ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత సామరస్యం దెబ్బతీస్తున్నారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని బాంద్రా కోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు కంగన, ఆమె సోదరి రంగోలీలకు సమన్లు పంపారు. ఇప్పటికి రెండుసార్లు సమన్లు పంపినా వారు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. తమ సోదరుడి పెళ్లి పనుల్లో ఉన్నామంటూ తమ లాయర్ ద్వారా బదులిచ్చారు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు మూడోసారి సమన్లు జారీచేశారు. దాంతో కంగన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News