మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కోడలి సంచలన ఆరోపణలు

Jogi Ramesh Sensational allegations by daughter-in-law against former minister
  • మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు
  • అదనంగా రూ.5 కోట్లు, ఫార్చ్యూనర్ కారు కోసం వేధించారని వెల్లడి
  • భర్త, అత్తమామలు తనపై పలుమార్లు హత్యాయత్నం చేశారని ఆవేదన
  • దిండుతో నొక్కి, చున్నీతో ఉరి బిగించి చంపాలని చూశారని వెల్లడి 
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా, పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలను ప్రస్తావించారు.  

ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. 2025 మే 28న సూర్యాపేటలో జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌తో మేఘనకు వివాహం జరిగింది. పెళ్లి కానుకగా రూ.5 కోట్లు, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి సహా పలు విలువైన బహుమతులు ఇచ్చినా.. భర్త, అత్తమామలు తనను వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అదనంగా మరో రూ.5 కోట్లు, ఫార్చ్యూనర్ కారుతో పాటు అత్తగారికి, ఆడపడుచులకు వజ్రాల నగలు కావాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.

తన పేరిట ఉన్న ఆస్తులను భర్త పేరుతో బదలాయించాలని వేధించారని, అందుకు అంగీకరించకపోవడంతో తనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని మేఘన ఆరోపించారు. మామ జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి తనను టెర్రస్‌పై నుంచి తోసేయాలని ప్రయత్నించారని తెలిపారు. గతంలో గోవా పర్యటనలోనూ పడవ నుంచి నీటిలోకి తోసేందుకు యత్నించి, ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో తనను వదిలేసి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 13న రాత్రి తనపై కుటుంబ సభ్యులు భౌతిక దాడికి పాల్పడ్డారని మేఘన తన ఫిర్యాదులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భర్త రాజీవ్ చున్నీతో తన గొంతు నులమగా, మామ జోగి రమేశ్ దిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చంపాలని చూశారని ఆరోపించారు. ప్రాణ భయంతో వేడుకోవడంతో చివరకు వదిలేశారని పేర్కొన్నారు. తాను పూజలు నిర్వహిస్తుంటే అవమానించేవారని, తన అత్తమామల కుటుంబం క్రైస్తవ మతంలోకి మారిన విషయం తనకు ఆ తర్వాతే తెలిసిందని ఫిర్యాదులో వివరించారు.

పెళ్లికి ముందే తన భర్తకు ఉన్న అనారోగ్య సమస్యలను దాచిపెట్టి మోసం చేశారని మేఘన ఆరోపించారు. మాజీ మంత్రి కుటుంబంపై కోడలు చేసిన ఈ తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మేఘన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.                                
Advertisement
Jogi Ramesh
Jogi Rajiv
Jogi Ramesh Daughter In Law Meghana
Dowry Harassment Case
YSRCP Leader Allegations
Andhra Pradesh Political News

More Telugu News