అమెరికా-ఇరాన్ మధ్య తగ్గిన ఉద్రిక్తతలు... తెరవెనుక దౌత్య చర్చలు

USA Iran tensions ease as behind the scenes diplomatic talks begin
  • అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా ఆగిన దాడులు
  • మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు
  • దౌత్యానికి అవకాశం ఇచ్చేందుకే దాడులు ఆపినట్టు తెలిపిన ట్రంప్
  • అమెరికా దాడులు ఆపితేనే తాము సంయమనం పాటిస్తామన్న ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని వారాలుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరు దేశాలు గత మూడు రోజులుగా పరస్పర దాడులకు దూరంగా ఉన్నాయి. ఇదే సమయంలో మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్‌తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్టు ఇరాన్ సోమవారం ప్రకటించింది. దీంతో దౌత్య మార్గాలు ఇంకా తెరిచే ఉన్నాయని, ఉద్రిక్తతలు మరింత పెరగకపోవచ్చని ఆశలు చిగురిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైమానిక దాడులను నిలిపివేయడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. దౌత్యానికి మరో అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఐరాస రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు. చర్చలకు కొంత సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే, అమెరికా ఉద్దేశాలపై తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా దాడులు ఆపితేనే తాము కూడా దాడులు ఆపుతామని, ఈ సందేశాన్ని ఇప్పటికే వాషింగ్టన్‌కు పంపామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా చర్యలను బట్టే తమ సంయమనం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. గతంలో చర్చల సమయంలో అమెరికా తమను మోసం చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఆరోపించారు.

మరోవైపు, సైనిక చర్యల కొనసాగింపుపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. నిరంతర దాడుల వల్ల పేట్రియాట్ గగనతల రక్షణ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గాయని, నిర్దేశిత లక్ష్యాలను ఇప్పటికే ఛేదించడంతో ఇకపై దాడులు కొనసాగించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని సైనికాధికారులు ట్రంప్‌కు సూచించినట్టు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దాడులు ఆగినా, ఈ విరామం ఎంతకాలం కొనసాగుతుందోనన్న అనిశ్చితి ఇరు దేశాల్లో నెలకొంది.
Advertisement
USA Iran
Donald Trump
Diplomatic Talks
Middle East Tensions
Mike Waltz
Patriot Missiles

More Telugu News