అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త రికార్డు.. 24 రోజుల్లో 4 లక్షలు దాటిన భక్తులు!

Amarnath Yatra sets new record as 4 lakh pilgrims visit in 24 days
  • ఇప్పటివరకు 4.14 లక్షల మందికి పైగా భక్తుల దర్శనం
  • నిర్వహణ పనుల వల్ల పహల్గామ్ మార్గం తాత్కాలికంగా మూసివేత
  • భద్రతా కారణాలతో ఈ ఏడాది నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలు
  • ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమితో ముగియనున్న యాత్ర
జమ్మూకశ్మీర్‌లో పవిత్ర అమర్‌నాథ్ యాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జులై 26 నాటికి 4.14 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్ మనోజ్ సిన్హా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. పరమశివుని కృప వల్లే ఇది సాధ్యమైందని, యాత్ర సజావుగా సాగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఆదివారం జమ్మూలోని భగవతి నగర్ యాత్రీ నివాస్ నుంచి 4,474 మందితో కూడిన నూతన బృందం బల్తాల్ బేస్ క్యాంపునకు బయలుదేరింది. అయితే, ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా సంప్రదాయ పహల్గామ్ (నున్‌వాన్) మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ యాత్ర ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ పర్వదినం రోజున ముగియనుంది.

భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏడాది బేస్ క్యాంపుల పరిసర ప్రాంతాలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించడంతో హెలికాప్టర్ సేవలు అందుబాటులో లేవు. యాత్రికులు కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ బేస్ క్యాంపు నుంచి కాన్వాయ్‌లలో ప్రయాణిస్తున్నారు. భక్తులు సాధారణంగా రెండు మార్గాల ద్వారా పవిత్ర గుహను చేరుకుంటారు. ఒకటి, తక్కువ దూరమున్న బల్తాల్ మార్గం (14 కి.మీ) కాగా, మరొకటి సుదీర్ఘమైన సంప్రదాయ పహల్గామ్ మార్గం (47 కి.మీ). సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే హిమలింగం, చంద్రుని గమనానికి అనుగుణంగా పరిమాణం మారుతూ భక్తులకు దర్శనమిస్తుంది.                                
Advertisement
Amarnath Yatra
Manoj Sinha
Jammu and Kashmir
Ice Lingam
Baltal Pahalgam route
Pilgrim record

More Telugu News