Maharashtra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం... స్టార్ హోటల్ లో ఫడ్నవీస్, సంజయ్ రౌత్ భేటీ!

  • ఇరువురు నేతల చర్చలు
  • నిజమేనన్న బీజేపీ నేత
  • 'సామ్నా' కోసం ఇంటర్వ్యూ మాత్రమే
  • అంతకన్నా ఏమీ లేదన్న కేశవ్ ఉపాధ్యాయ్
Fadnavis and Sanjay Rout Meet Secretly in A Star Hotel

మహారాష్ట రాజకీయాల్లో నిన్న రాత్రి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో పరస్పరం విమర్శల దాడికి దిగుతున్న బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఇలా సమావేశం అయ్యారన్న వార్తలు దేశ రాజకీయాల్లో చర్చకు దారి తీయగా, ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని బీజేపీ స్పష్టం చేసింది.

ఈ విషయమై వస్తున్న ఊహాగానాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యాయ్, శివసేన ఆధ్వర్యంలో నడుస్తున్న సామ్నా పత్రిక కోసం ఫడ్నవీస్ ను ఇంటర్వ్యూ చేయాలని సంజయ్ రౌత్ భావించారని, అందుకే ఆయనతో సమావేశమయ్యారని వెల్లడించారు. సంజయ్ కోరిక మేరకు ఫడ్నవీస్ హోటల్ కు వెళ్లారని, అయితే, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన తరువాతనే తాను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పి వచ్చారని అన్నారు. 

ఇదిలావుండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేన పార్టీల మధ్య ఫలితాల తర్వాత తీవ్ర విభేదాలు తలెత్తగా, శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి టాలీవుడ్ డ్రగ్స్ కేసు, సుశాంత్ ఆత్మహత్య, ఆపై కంగనా రౌనత్ విమర్శలు తదితర అంశాల్లోనూ ఈ రెండు పార్టీల మధ్యా విమర్శలు, ప్రతి విమర్శలూ సాగుతున్నాయి.

More Telugu News