Police: డ్రగ్స్‌ కేసులో ముంబైకి చెందిన మరో ఆరుగురి అరెస్టు

  • సుశాంత్‌సింగ్‌ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
  • కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్ అరెస్టు
  • అంకుశ్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే కూడా
  • ఇప్పటివరకు మొత్తం 16 మంది అరెస్టు
six more arrested by police in drugs case

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. డ్రగ్స్‌ కేసులో నిన్న ముంబైకి చెందిన కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్, అంకుశ్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో అధికారులు తెలిపారు.

ఈ ఆరుగురితో కలిపి ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య 16కు చేరింది. కొత్తగా అరెస్టయిన ఈ ఆరుగురు డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకున్నట్లు అధికారులు వివరించారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌కు డ్రగ్‌ డీలర్‌ ఫెర్నాండెజ్ సహాయకుడిగా ఉండేవాడు. అతడి ద్వారానే షోవిక్‌కు మాదకద్రవ్యాలు చేరేవి.

ఇక సెలబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేసే వారికి కొత్తగా అరెస్టయిన ఈ ఆరుగురు సహాయకులుగా ఉన్నారు. సందీప్‌ గుప్తా గతంలో ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేసి, ఫెర్నాండెజ్‌ లాంటి డ్రగ్‌ డీలర్లకు గంజాయి రవాణా చేసేవాడు. వీటన్నింటి గురించి అధికారులు పూర్తి వివరాలు సేకరించారు.

More Telugu News