Tapsee Pannu: ఇప్పుడు బతికే ఉంటే సుశాంత్ ను జైల్లో పెట్టేవారేమో!: తాప్సీ కీలక వ్యాఖ్యలు

Actress Tapsee Comments on Rhea
షార్ట్స్‌లో చూడండి
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తరువాత, కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆమె ఎక్కడా డ్రగ్స్ వాడినట్టు పేర్కొనబడలేదని గమనించిన హీరోయిన్ తాప్సీ, కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆమె, రియా డ్రగ్స్ ను కొనుగోలు చేసి, అందించినట్టుగా ఈ నివేదికలో ఉందని, ఈ లెక్కన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బతికే ఉంటే, ఆయన్ను జైల్లో పెట్టుండేవాళ్లని కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఆమె డ్రగ్స్ వాడలేదు. సుశాంత్ కోసం కొని, అందించింది. అందువల్ల ఈ కేసులో సుశాంత్ బతికే ఉంటే జైల్లో వేసుండేవాళ్లా? ఓహ్... నో... ఆమె బలవంతంగా డ్రగ్స్ అందించిందంటారా? మరిజువానా తేవాలని సుశాంత్ ఆమెను బలవంతం చేసుంటాడు. అవును... అదే జరిగుంటుంది. అందుకే ఆమె తెచ్చుంటుంది" అని వ్యాఖ్యానించింది. కాగా, డ్రగ్స్ తేవడం, అందుకు డబ్బులు పంపడం తదితర వ్యవహారాల్లో రియా ప్రమేయం ఉన్నట్టు రిమాండ్ కాపీలో ఎన్సీబీ పేర్కొన్నట్టు తెలుస్తుండగా, ఆమె డ్రగ్స్ వాడినట్టుగా మాత్రం ఎక్కడా అధికారులు పేర్కొనలేదు.

ఇదిలావుండగా, రియాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ, మంగళవారం నాడు న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య తరువాత రియాపై ఆరోపణలు రాగా, ఇప్పుడు రియా అరెస్ట్ అయిన తరువాత, ఆమెకు మద్దతు పెరుగుతోంది. దియా మీర్జా, అనురాగ్ కశ్యప్ తదితరులు 'జస్టిస్ ఫర్ రియా' అంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు. సోనమ్ కపూర్ కూడా రియాకు మద్దతుగా నిలవడం గమనార్హం. తాము రియాకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలను సేకరించిన తరువాతనే అరెస్ట్ చేశామని ఎన్సీబీ అధికారులు అంటుండటం గమనార్హం.
Go Back to Shorts
Tapsee Pannu
Rhea
Sushant Singh Rajput
Drugs

More Telugu News